Saturday, July 18, 2015

జ‌ర్నలిజపు ప్రమాద‌క‌ర పార్శ్వం

టంక‌శాల అశోక్ అనే జ‌ర్నలిస్టుకి మేధావిగా చాలా గుర్తింపు ఉంది. అనేకానేక ప‌త్రిక‌ల్లో చేసిన అనుభవం, దానికంటే, రాష్ట్ర విభజన డిమాండ్ కు అనుకూలంగా ఆంధ్ర అనే ప‌దాన్ని అన్ని ర‌కాల దుర్మార్గాల‌కు ప్రతీక‌గా చిత్రీక‌రించ‌డంలో ఆయ‌న చేసిన కృషి అంద‌రికి సుప‌రిచితం. ఇందుకు గుర్తింపుగా ఆయ‌న‌కు అనేక స‌న్మానాలు, స‌త్కారాలు కూడా జ‌రిగాయి.

ఇంత‌ ఆరితేరిన జర్నలిస్టు ఏదైనా రాస్తే, ఎంతో అధ్యయ‌నంతో, అవ‌గాహ‌న‌తో, నిష్పాక్షిక‌త‌తో ఆ రాత ఉంటుంద‌ని మ‌నబోటి సామాన్యులు త‌లుస్తారు. ఆయ‌న త‌ల‌పండిన‌వాడు గ‌నుక‌, ఆయ‌న రాసిన విష‌యాలు స‌త్యసంధ‌త‌కు మారుపేరుగా, ఆయ‌న విశ్లేష‌ణ‌లు తార్కిక‌వాదానికి సోదాహ‌ర‌ణ‌లుగా నిలుస్తాయ‌ని న‌మ్ముతారు.

కాని, కొంచెం లోతుకు వెళ్లి, ఈయ‌న రాత‌ల‌ను చ‌ద‌వండి. వాటిల్లోని డొల్లత‌న‌మూ, వ‌క్రీక‌ర‌ణా, లేకిత‌న‌మూ మనల్ని నిశ్చేష్ఠులను చేస్తాయి.

వికీలీక్స్ వ్యవ‌హారంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర గురించి ఈయ‌న‌ న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌లో ``ఫెడ‌ర‌లిజ‌పు ప్రమాద‌క‌ర పార్శ్వం`` అనే అనే శీర్షికతో విమ‌ర్శనాత్మక‌ వ్యాసం రాశారు.  అస‌లు మ‌న‌దేశానికి ఫెడ‌ర‌లిజం (స‌మాఖ్య వ్యవ‌స్థ‌) అనే భావ‌నే పెనుప్రమాదంగా మారింద‌ని చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహ‌ర‌ణ అని కూడా సెల‌విచ్చారు. బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టిన  ఈ అంశం మీద త‌ర్వాత మాట్లాడ‌దాం.

స‌మాఖ్య వ్యవస్థే దేశానికి మంచిది కాదేమో అనేంత నేరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది? ఇందుకు సంబంధించి వికీ లీక్స్ లో ఏం బ‌య‌ట‌ప‌డింది?

``ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ప‌రిక‌రాలు `అత్యవ‌స‌రంగా` కావాల‌ని హాకింగ్ టీం అనే కంపెనీ హైద‌రాబాద్ ప్రతినిధిని తొంద‌ర‌పెట్టింది. త‌న ఫోన్ ట్యాపింగ్ అయింద‌ని చంద్రబాబు ఆరోపించిందే త‌డ‌వు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్యాపింగ్ ప‌రిక‌రాలు కొనుగోలు చేయ‌డానికి `వేగంగా` ప్రయ‌త్నించింది. అయితే, ఈ ప్రయ‌త్నాలు వికీలీక్స్ లో బ‌య‌ట‌పడేస‌రికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దొంగ‌లాగా దొరికిపోయింది.  ఈ ఆరోప‌ణ‌లు (?) వ‌స్తే, వీటి మీద విచార‌ణ కూడా జ‌రిపించ‌డం లేదు. దీంతో, ఆంధ్రప్రదేశ్ చాలా పెద్ద నేరం చేసిన‌ట్టు మ‌న‌కు స్పష్టమ‌వుతోంది. స‌మాఖ్య వ్యవ‌స్థ ఇచ్చిన అలుసు కార‌ణంగానే, రాష్ట్రాలు ఇలా స్వతంత్రంగా వ్వహ‌రిస్తున్నాయి. ఆర్థిక సంస్కర‌ణ‌లు వ‌ల్ల కూడా రాష్ట్రాలు రెచ్చిపోతున్నాయి. దీనిని వెంట‌నే క‌ట్టడి చేయ‌క‌పోతే, దేశ స‌మైక్యత‌కే భంగం .``

ఇదీ ఆయ‌న వ్యాసంలోని సారాంశం. నేతిబీర‌కాయంలో నేయి ఎంత ఉంటుందో, ఈయ‌న రాసిన ఈ సొంత పైత్యంలో అంతే నిజమూ, అంతే నిష్పాక్షికత ఉంది.

మొద‌టి సంగ‌తి, ఈయ‌న వికీలీక్స్ లో వెల్లడైన ప‌త్రాల‌ను స‌మ‌గ్రంగా చ‌ద‌వ‌లేదు. చ‌ద‌వ‌డానికి ప్రయ‌త్నించిన దాఖ‌లా ఈ వ్యాసంలోనైతే లేదు.   తాను వ్యాసం రాసిన ప‌త్రిక‌లో వ‌చ్చిన వంక‌ర స‌మాచారమే ఈయ‌న‌కు ప్రాతిప‌దిక‌. అందులో రాసిన‌ అర్థ స‌త్యాల‌ను, అబ‌ద్ధాల‌ను, చెప్పని నిజాల‌ను ఆధారం చేసుకొని రాసిన‌దీ వ్యాసం.

ఇంత‌కీ వికీలీక్స్ ద్వారా వెల్లడైన విష‌యాలు ఏమిటి?
  1. 2014 జ‌న‌వ‌రిలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెమ్ కో ఇండియా ద్వారా హ్యాకింగ్ టీం సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసింది.
  2.  ఆంధ్రప్రదేశ్ తో పాటు, క‌ర్ణాట‌క‌, గుజ‌రాత్, మ‌హారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు కూడా హ్యాకింగ్ టీం సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారు.
  3.  ఇదే స‌మ‌యంలో కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియ‌ట్ కు, కేంద్ర ఇంట‌లిజెన్స్ విభాగానికి కూడా ఈ సాఫ్ట్ వేర్ ను అమ్మజూపారు.
  4.  వీటితో పాటు, రీసెర్చి అండ్ ఎనాల‌సిస్ వింగ్, నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ, ఇంట‌లిజెన్స్ బ్యూరో (ఐబి), నేష‌న‌ల్ టెక్నిక‌ల్ రీసెర్చి ఆర్గనైజేష‌న్ - వీరంద‌రికి ఇట‌లీకి చెందిన హ్యాకింగ్ టీం కంపెనీ, నిఘా వ్యవస్థల పైన 2014 జ‌న‌వ‌రి లో వెబినార్ నిర్వహించింది.
  5.  2014 న‌వంబ‌రులో ప‌శ్చిమ బెంగాల్ ప్రభుత్వం త‌ర‌ఫున యాంటీ టెర్రరిస్ట్ సెల్ నిఘా ప‌రిక‌రాల కొనుగోలుకు ఇదే కంపెనీకి ఈమెయిల్ ద్వారా స‌మాచారం కోరింది. 
  6. - 2015 జూన్ లో సెల్యుల‌ర్ నిఘా వ్యవ‌స్థకు సంబంధించిన వివ‌రాల కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రయ‌త్నించింది.
ఇవీ, వికీలీక్స్ వెల్లడించిన మొత్తం విష‌యాలు.
  • ఇందులో మొద‌టి పాయింటు, 2014 జ‌న‌వ‌రిలో హ్యాకింగ్ టీం సాఫ్ట్ వేర్ ను అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్న విష‌యం టంక‌శాల గారి వికీలీక్స్ ప‌త్రాల్లో మ‌రుగున ప‌డిపోయిందా?
  • లేక, విభ‌నానంత‌ర‌ ఆంధ్రప్రదేశ్ ని మాత్రమే టార్గెట్ చేయాల‌నే దురుద్దేశంతో, ఈ నిజాన్ని దాచిపెట్టారా?
  • ఈ కొన్న హ్యాకింగ్ టీం నిఘా సాఫ్ట్ వేర్ రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఎవ‌రి ద‌గ్గర ఉంది? 
  •  తెలంగాణ ప్రభుత్వం ద‌గ్గర ఉంటే, ఎవ‌రి మీద నిఘా కోసం ఈ సాఫ్ట్ వేర్ ను  వినియోగించారో చెప్పాల‌ని డిమాండ్ చేయాల్సిన అవ‌సరం మ‌న మేధావికి లేదా? 
  • ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంలోని చాలా సంస్థలు హ్యాకింగ్ టీం ప్రతినిధుల‌తో ఉత్తర‌ప్రత్యుత్తరాలు జ‌రిపాయ‌న్న విష‌యాన్ని ఎందుకు మ‌రుగుప‌ర్చారు?
  • విభ‌జ‌న త‌ర్వాత ఏర్ప‌డిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ నిఘా ప‌రిక‌రాలు స‌మ‌కూర్చుకోవ‌డాన‌కి ప్రయ‌త్నించ‌డం ఎలా నేర‌మైంది?
  •  తెలంగాణ ప్రభుత్వానికి, ఇత‌ర రాష్ట్ర ప్రభుత్వాల‌కు మాత్రం ఫోన్ ట్యాపింగ్, నిఘా ప‌రికరాలు ఉండ‌వ‌చ్చుగాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ఈ అధికారం, అవ‌స‌రం లేద‌ని ఏ ప్రాతిప‌దిక‌న టంక‌శాల చెబుతున్నారు?
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ఈ ప‌రిక‌రాల‌ను కొన‌లేద‌నే వాస్తవాన్ని ఎందుకు దాచిపెట్టారు?
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ, ఏపి పోలీసులు గానీ రాసినట్టుగా ఏ ఈమెయిలూ, లేఖా వికీ లీక్స్ లో బ‌య‌ట‌ప‌డ‌లేదు. కాసు ప్రభాక‌ర్ అనే వ్యక్తి, త‌మ కంపెనీకి రాసిన లేఖ‌లో, ఏపి పోలీసుల కోసం వివ‌రాలు కావాల‌ని ఈమెయిల్ ఇవ్వడం మిన‌హా, ఇందులో ఏపి పోలీసులు నేరుగా ఎవ‌రినైనా సంప్రదించిన‌ట్టుగానీ, లేఖ రాసిన‌ట్టుగానీ ఆధారం లేదన్న విష‌యాన్ని దాట‌వేయ‌డం క‌రెక్టేనా?
  •  ఏపి పోలీసులు నిఘా ప‌రికరాల‌ని కొన్నట్టుగానీ, హ్యాకింగ్ టీంతో నేరుగా మాట్లాడిన‌ట్టుగానీ వికీలీక్స్ లో ప్రస్తావ‌నే లేన‌ప్పుడు, ఈ మొత్త వ్వవ‌హారం మీద దేనికోసం విచార‌ణ జ‌ర‌పాలి?
  • నిఘా ప‌రిక‌రాలు, ఫోన్ ట్యాపింగ్ ప‌రిక‌రాలు ప్రభుత్వం ఉంచుకోవ‌డం ఘోరమూ, నేరమూ, అనైతిక‌మైతే, అప్పటి ఉమ్మడి ప్రభుత్వం తెప్పించుకున్న ఈ ప‌రిక‌రాల‌ను తెలంగాణ ప్రభుత్వం  త‌న అధీనంలో ఉంచుకోవ‌డం అనైతికం కాకుండా ఎలా పోయింది?
  • దేశంలోని అన్నిరాష్ట్ర  ప్రభుత్వాల‌తో పాటు, కేంద్ర సంస్థల‌తో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిఘా ప‌రిక‌రాలు క‌లిగి ఉండాల‌నుకుంటే, అది ప్రత్యేకంగా త‌ప్పు అని ఎందుకు అనిపించింది?
  •  ఫ‌లానా వాళ్లకు నేను మ‌న ఎక్విప్ మెంట్ అమ్ముదామ‌నుకుంటున్నాను, ఈ ప‌రిక‌రాల‌కు సంబంధించి మ‌రిన్న వివ‌రాలు నాకు ఇస్తారా అని  ఎవ‌రో ఒక బ్రోక‌ర్ తన కంపెనీలో  పైవాళ్లకు ఒక ఈమెయిల్ ఇస్తే, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స‌మాధానం చెప్పాలన‌డం అమాయ‌క‌త్వమా, అఙ్ఞాన‌మా?
  • వాస్తవాలు ఇలా ఉంటే,  చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంతో సంబంధం లేకుండా, డైర‌క్టుగా ఒక ఇటాలియ‌న్ గూఢ‌చారి ప‌రికరాల‌ను కొనేస్తోంది అన‌డం దురుద్దేశ‌పూర్వకంగా వాస్తవాల‌ను వ‌క్రీక‌రించ‌డం, తిమ్మిని బ‌మ్మిని చేయ‌డం కాదా?
  •  ఆలూ లేదు, చూలూ లేదు, కొడుకు పేరు సోమ‌లింగం అన్నట్టు, ఏమీ లేని దానికి కేంద్ర ప్రభుత్వ అనుమ‌తి ఉందా లేదా అన్న చెత్త ప్రశ్నలు వేయ‌డం వెన‌క ఉద్దేశం ఏమిటి?
  •  ఒక వేళ కేంద్రం అనుమ‌తి కావాల్సి వ‌స్తే, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికేనా, తెలంగాణ‌, ఇత‌ర రాష్ట్రాల‌కు కూడా అవసరమా? ప‌్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ద‌గ్గర ఉన్న నిఘా ప‌రిక‌రాల‌కు కేంద్రం అనుమ‌తి ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఈయ‌న‌కు ఎందుకు క‌న‌బ‌డ‌లేదు?
  •  అస‌లు కేంద్రం అనుమ‌తి లేకుండా రాష్ట్రం నిఘా ప‌రిక‌రాలు కొన‌గూడ‌ద‌న్న ఈయ‌న సూత్రీక‌ర‌ణ ఏంటి? ఆ మాత్రం కేంద్ర ప్రభుత్వానికి తెలియ‌దా? కేంద్రప్రభుత్వానికి తెలియ‌కుండానే రాష్ట్రప్రభుత్వాలు వీటిని కొంటున్నాయ‌న్న నిర్థార‌ణ‌కు అస‌లు ఈయ‌న ఎలా వ‌చ్చారు?
  • ఈ లేని బూచిని చూపెట్టి, రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రంగా వ్యవ‌హ‌రిస్తున్నాయి, ఇది ఫెడ‌ర‌లిజం ప్రమాద‌క‌ర పార్శ్వం అని సూత్రీక‌రించ‌డ‌మేంటి? ఇంత‌క‌న్నా, లేకి వాద‌న మ‌రొక‌టి ఉంటుందా? 
  •  వికీలీక్స్ పేరుతో అవాకులు చెవాకులు మ‌న‌మే రాసేసి, మ‌న‌మే స‌మాఖ్య వ్యవ‌స్థ వల్ల అన‌ర్థం జ‌రుగుతుంద‌ని ఒక కొత్త థియ‌రీ లేవ‌దీయ‌డం మేధోప‌ర‌మైన దివాలాకోరుత‌నం, అంత‌క‌న్నా కుట్రపూరితం కాదా?
  •  ఆర్థిక సంస్కర‌ణ‌ల వ‌ల్లే రాష్ట్రాలు స్వతంత్రంగా వ్యవ‌హ‌రించే ధోర‌ణి ప్రబ‌లింద‌ని చెప్పడం కంటే హాస్యాస్పదం ఇంకోటి ఉందా? బ‌ల‌మైన కేంద్రం ఉండాల‌ని కోరుకునే బిజెపి వంటి పార్టీలు అధికారంలో ఉండ‌గా, ఇదెలా సాధ్యమ‌న్న శంక మీకు రాలేదా?
  •  అయినా, ప్రాంతీయ పార్టీల వ‌ల్లే ఈ అన‌ర్థం జ‌రుతోందన్న మీ ఆవేద‌న ఆంధ్రప్రదేశ్ కే ప‌రిమిత‌మా, మిగ‌తా రాష్ట్రాల‌కు కూడా ఇది వ‌ర్తిస్తుందా? 
  • వికీలీక్స్ కి సంబంధించి ఆరోప‌ణ‌లు వ‌స్తే (మీరే ఆరోప‌ణ‌లు చేసి, మీరే వ‌చ్చాయ‌ంటారునుకోండి!), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత‌పూర్వకంగా ఖండించ‌లేద‌ని  ప‌చ్చి అబద్ధం ఒక‌టి మ‌ళ్లీ!


ఇంత స‌త్యదూరంగా, వాస్తవాల‌ను ఇంత వ‌క్రీక‌రించి, ఏమాత్రం అధ్యయ‌నం లేకుండా, ఆధారాల్లేని ఆరోప‌ణ‌ల ప్రాతిప‌దిక‌గా ఎడాపెడా రాసేయ‌డం ఏ ప‌రిణ‌తి చెందిన జ‌ర్నలిజానికి ప్రతీక‌! 

Friday, July 17, 2015

ఆంధ్రకి ఆగని అన్యాయం

వశేష’ ఆంధ్రప్రదేశ్‌కి ఇవాళ దిక్కూదివాణం లేదు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం తగిన బందోబస్తు చేసింది. 
ఎనిమిదిన్నర కోట్ల ప్రజల ఆశల, అవకాశాల కేంద్రంగా ఎదిగిన హైదరాబాద్‌నూ, దాని నుంచి సింహభాగంగా వచ్చే ఆదాయాన్నీ, విభజన పేరుతో మూడున్నర కోట్ల మందికి కట్టబెట్టడం గురించి కాదు ఈ మాట. 
హైదరాబాద్‌లో ఆంధ్రుల పరిరక్షణ కోసమంటూ, సెక్షన్‌ 8 అనే ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టించడం గురించి కాదు ఈ నిష్టూరం. చట్టంలో పెట్టలేకపోయాంగాని, పదేళ్ల ప్రత్యేక హోదా ఖాయమని పార్లమెంటు సాక్షిగా అవలీలగా అబద్ధాలు చెప్పడం గురించి కాదు ఈ విమర్శ. 
అరవై ఏళ్ల పాటు అందరి స్వేదంతో నిర్మితమైన వందలాది వ్యవస్థలను కూడా నిస్సిగ్గుగా లాగేసుకుంటే, ఈ పునర్‌ వ్యవస్థీ కరణ చట్టం అక్కరకు రాలేదని కూడా కాదు ఈ ఆక్రోశం. 
ఇంత అనైతికంగా, అన్ని సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా పరిశేష ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరుగుతుంటే, తెలుగువారికున్న ఏకైక మహానగరంలోని మేధావులు గానీ, మార్క్సిస్టులు గానీ, హక్కుల కార్యకర్తలు గానీ, రాజకీయ పార్టీలుగానీ, ప్రొఫెసర్లుగానీ, ఉపన్యాసకులు గానీ - ఒక్కరంటే ఒక్కరు కూడా నోరెత్తి, ఇది అధర్మం అని చెప్పేవారు లేరా అని ఈ ఆవేదన. 
హైదరాబాద్‌ (ఆదాయం) లేదన్నారు సరే. సెక్షన్‌ 8 చెల్లదన్నారు పోనివ్వండి. షెడ్యూల్‌ 10లోని 142 ప్రభుత్వ సంస్థలు కూడా మావేనని బుకాయిస్తే, అందుకు కోర్టు కూడా కోడిగుడ్డు మీద వెంట్రుకలేరితే, ఇక చివరకు మిగిలేదేమిటి?

హైదరాబాద్‌లోని సుపరిపాలనా కేంద్రాన్ని అత్యాధునిక వస తులతో, అధునాతన భవనాల్లో 2001లో అప్పటి ముఖ్యమంత్రి చొరవతో ప్రారంభించారు. పాలనలో కొత్త పంథా అవలంబిం చేందుకు, అందుకు అనుగుణంగా పాలనాయంత్రాంగానికి తర్ఫీదునిచ్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన ఈ కేంద్రం దేశ విదేశాల్లో పేరు సంపాదించుకుంది. ఉమ్మడిగా ఏర్పరుచున్న ఈ సంస్థ మొత్తం మాదేనని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం లాగేసుకుంటోంది. సుపరిపాలనా కేంద్రం వంటి మరి 126 సంస్థలు హైదరాబాద్‌లోనే ఏర్పాటయ్యాయి కాబట్టి, ఇవన్నీ మావేనని తెలంగాణప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధ్యర్యంలో ఏర్పడిన సంస్థల్లో నూట ఏడింటిని పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్‌-10 కింద పెట్టారు. ఆ తర్వాత కొద్ది కాలానికి (ఈ ఏడాది మే 7న), ఈ జాబితాకి మరో 35 సంస్థలను గుట్టు చప్పుడు కాకుండా కేంద్రం జతచేసింది. అంటే, ఉమ్మడి రాష్ట్రం లోని 142 సంస్థలు ప్రస్తుతం ఈ షెడ్యూల్‌-10 కింద ఉన్నాయి.


అరవై ఏళ్ల పాటు తెలుగువారందరికి రాజధానిగా ఉన్నందు వల్ల, ఈ 142 ప్రభుత్వ సంస్థల్లో 123 సంస్థలని హైదరాబాద్‌ నగరంలోనూ, శివారుల్లోనూ నెలకొల్పారు. అక్షరాలా పదహారు (16) సంస్థలను మాత్రమే, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పెట్టారు. మూడు సంస్థలు హైదరాబాద్‌ బయట తెలంగాణ జిల్లాల్లో ఉన్నాయి. షెడ్యూల్‌-10 కింద హైదరాబాద్‌లో ఉన్నవి చిన్నాచితకా సంస్థలుకావు. విద్యారంగానికి సంబంధించిన అన్ని బోర్డులు, సొసైటీలు ఇందులోనే ఉన్నాయి. తెలుగు, హిందీ, సంస్కృతం అకాడెమిలు ఈ జాబితాలోనివే. జేఎన్‌టీయూ ఫైన్‌ ఆర్ట్స్‌, తెలుగు విశ్వవిద్యాలయం, అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వ విద్యాలయం, రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం దగ్గర నుంచి టెక్స్ట్‌ బుక్‌ ప్రెస్‌, స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ, ఓరియంటల్‌ మాన్యుస్ర్కిప్ట్స్‌ లైబ్రరీ, స్టేట్‌ ఆర్కైవ్స్‌ దీనికిందకే వస్తాయి. సైన్సు, పోలీసు, సర్వే, అటవీ, కనస్ట్రక్షన్‌ మొదలైన అకాడెమిలు, పొల్యూషన్‌ కంట్రోల్‌, బయో డైవర్శిటీ, సోషల్‌ వెల్ఫేర్‌, వక్ఫ్‌ వంటి బోర్డులు, ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళా, బాలల హక్కుల కమిషన్లు ఈ జాబితాలోనివే. ఆనాటి ఆంధ్రప్రదేశ్‌లోని 23 జిల్లాల ప్రజలు కట్టిన పన్నుల నుంచి, అప్పటి మొత్తం రాష్ట్ర జనాభాకి సేవల అందించడం కోసం, ఆరు దశాబ్దాల పాటు, అందరి కృషితో ఏర్పాటైన సంస్థలివి. అరవై ఏళ్ల పాటు ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ, అందరూ కలిసి కట్టుకున్న పరిపాలనా వ్యవస్థలివి.

‘కొన్ని రాష్ట్ర స్థాయి ప్రభుత్వసంస్థల సేవలు అందుబాటులో ఉండటం గురించి’ అనే మకుటంతో ఈ షెడ్యూల్‌-10 ఉంది. ఈ షెడ్యూల్‌ గురించి సెక్షన్‌ 75 (1) వివరించింది. ‘ఆయా రాష్ర్టాల్లో ఉన్న ఉమ్మడి రాష్ట్ర సంస్థల సేవలను పొరుగు రాష్ర్టా నికి ఎటువంటి లోటు లేకుండా సమకూర్చాలి. అపాయింటెండ్‌ తేదీ నుంచి (అంటే 2014 జూన్‌2 నుంచి) ఏడాది లోగా దీనికి సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఒప్పందానికి రావాలి. రాని పక్షంలో, కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలి,’ అనేది ఈ సెక్షన్‌ సారాంశం.

ఈ సెక్షన్‌లో ఎక్కడా సంస్థల యాజమాన్యం (ఒనర్‌ షిప్‌) గురించిన ప్రస్తావన లేదు. అంటే, ఏ రాష్ట్రంలో ఈ సంస్థలు ఉంటే, ఆ రాష్ట్ర ప్రభుత్వానికే ఇవన్నీ దఖలు పడతాయని ఈ సెక్షన్‌ చెప్పలేదు. నిజానికి, రెండు రాష్ర్టాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకం గురించి చట్టంలోని ఆరో భాగంలోని సెక్షన్‌ వివరించింది. ఆస్తులు, అప్పుల పంపకాలు ‘సముచితంగా, సహేతుకంగా, న్యాయబద్ధం’గా జరగాలని(47.3), ఈ పంపకం జనాభా ప్రాతిపదికన (అంటే 58:42 నిష్పత్తిలో) ఉండాలని (48.1.బి), ఒకవేళ రెండు రాష్ర్టాలు ఈ విషయంలో ఒక అవ గాహనకు రాలేకపోతే, భారత కంట్రోలర్‌అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ సలహా ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యత నిర్వర్తిస్తుందని (47.4) ఈ సెక్షన్‌ స్పష్టం చేసింది. ఈ సెక్షన్‌లో పదే పదే వాడిన పదాలు ‘సముచితంగా, సహేతుకంగా, న్యాయబద్ధంగా’ రెండు రాష్ర్టాల మధ్య ఆస్తులు, అప్పుల విభజన జరగాలని. అలాగే, సెక్షన్‌ 64 కూడా, ఆస్తులు అప్పులకు సంబంధించి ఇరు రాష్ర్టాలూ ఒక అవగాహనకు వచ్చి పంచుకోవాలని, లేని పక్షంలో కేంద్రం ఆదేశాలప్రకారం నడుచుకోవాలని చెబుతుంది.

అయితే, దబాయిస్తే ఏ మాటైనా చెల్లుబాటు అవుతుందనే వైఖరికి అలవాటుపడ్డ తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఈ సంస్థలన్నీ హైదరాబాద్‌లో, అంటే తెలంగాణ భూభాగంలో ఉన్నాయి కాబట్టి, తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయనే వాదన మొదలుపెట్టారు. రాజ్యాంగం ప్రకారం, ఏ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ సంస్థలు ఆ రాష్ర్టానివే కాబట్టి; ఇవాల్టి రోజున ఈ ప్రాంతం భౌగోళికంగా తెలంగాణకాబట్టి, ఈ సంస్థలన్నిటినీ మేం కలిపేసుకుంటున్నాం అని తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉన్నత విద్యామండలి కేసులో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు తమకు అనుకూలంగా ఉండటంతో, తెలంగాణ ప్రభుత్వం ఇక అన్నీ తమవేననే ధీమాతో ముందుకు వెళు తోంది. హైదరాబాద్‌లో ఉన్న అన్ని షెడ్యూల్‌-10 సంస్థలను స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాలు కూడా జారీ చేశారు. నిజానికి, అంతకుముందే ఏపీ ప్రభుత్వం వేసిన అప్పీలుకు స్పందించిన సుప్రీం కోర్టు, ఆంధ్ర ప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి హైదరాబాద్‌లో తన కార్యకలా పాలు నిర్వహించవచ్చని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీని మీద తుది తీర్పు సుప్రీం కోర్టు వెలువరించాల్సి ఉంది.

కేసు ఫలితం ఏమైనా కావచ్చు. కాని, ఈ మొత్తం వ్యవహారంలో ప్రజాస్వామ్యవాదులమని చొక్కాలు చించుకునే వారికీ, ప్రజల హక్కులు మీదా, న్యాయాన్యాయాల మీద మాట్లాడే పేటెంట్‌ మాదేనని చెప్పుకునే మేధావివర్గానికీ, హక్కుల సంఘాలకూ ఎదురయ్యే ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఆరుదశాబ్దాల ఉమ్మడి కష్టాన్ని ఒక్కరే తన్నుకు పోతామనడం న్యాయమేనా? మూడున్నరకోట్ల తెలంగాణ ప్రజలకు జరగాల్సిన న్యాయం, ఐదు కోట్ల ఆంధ్ర, రాయలసీమ ప్రజలకు అవసరం లేదా? చట్టం, రాజ్యాంగం ఏం చెప్పిందని అలా ఉంచితే, సహజ న్యాయసూత్రాలు, సామరస్య పంపకాలకు ఎలాంటి ప్రాధాన్యం లేదా? స్థానబలం ఉందికదాని, నీతి న్యాయాలను వదిలేసి, ఆటవిక ధర్మాన్ని పాటించడాన్ని ఖండించాల్సిన అవసరం లేదా? చట్ట ప్రకారం చూసినా కూడా ఈ 142 సంస్థలకు సంబంధించి ఏడాది లోగా రెండు ప్రభుత్వాల మధ్య అవగాహన కుదరని పక్షంలో, కేంద్రమే పంపకాలు చేయాల్సి ఉంది. ఆ సమయం ముగిసింది కూడా. కేంద్రం నిర్ణయం తర్వాతే కోర్టుల జోక్యం ఉండొచ్చు. ఆ రకంగా చూసినా, ఉన్నత విద్యామండలి కేసులో హైకోర్టు తీర్పును అడ్డంపెట్టుకొని, అన్ని సంస్థలను ఏకపక్షంగా మావేనని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం చట్టాన్ని వక్రీకరించడం కాదా? పోనీ వీటిలో కొన్నిటిని తెలంగాణకు బదలాయించి, ఆ మేరకు నష్టపరిహారం చెల్లించినా సరేనని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లేఖ రాస్తే, కేంద్రం ఇంతవరకూ కిమ్మనకపోవడం సబబేనా?

తెలంగాణ ప్రభుత్వ వైఖరి పదో షెడ్యూల్‌ విషయంలో ఏ రకంగా చూసినా కూడా సమర్థనీయం కాదు. సెక్షన్‌ ఎనిమిది గురించో, హైదరాబాద్‌ గురించో మాట్లాడితే తెలంగాణ ఆత్మగౌరవమూ, రాష్ర్టాల హక్కులూ అని ఉపన్యాసాలు దంచే మేధావులు, షెడ్యూల్‌-10లోని ఉమ్మడి సంస్థలు, ఆస్తుల గురించి భరించలేని మౌనమెందుకు వహిస్తారో తెలియదు.

కారణలేమైనా, కోస్తా, రాయలసీమ ప్రజలను అన్యాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తుంటే, ఇవాళ ప్రశ్నించే గొంతుకలేలేవు. సూది మొనంత భూమి కూడా ఇవ్వనని నిక్కచ్చిగా చెప్పిన ధుర్యోధనుడి మాదిరిగానే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మాట్లా డుతుంటే, ఈ వైఖరి అనర్థదాయకం అని చెప్పగల కురు వృద్ధులు, గురువృద్ధులు తెలుగు రాష్ర్టాల్లో లేకుండా పోయారు!                                                              
(Published in Andhra Jyothy on 11-07-2015)

సెక్షన్‌ ఎనిమిదీ, సమాఖ్య స్ఫూర్తీ



రాజ్యాంగంలో, చట్టంలో తమకు అనుకూలంగా ఉన్న వాటిని ఒప్పుకుంటామని, లేకపోతే దాని అమలును ఒప్పుకునేది లేదనే ఒక కొత్త సంస్కృతికి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం తెరలేపింది.

ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌ పాత్ర, అధికారాల గురించి విభజన చట్టంలోని సెక్షన్‌ 8 విస్పష్టంగా వివరిస్తే, శాంతిభద్రతల నిర్వహణ అధికారం తమదేనని తెలంగాణప్రభుత్వం ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చింది. ఏడాది తర్వాత, భారత అటార్నీజనరల్‌ సెక్షన్‌ 8 మీద వివ రణ ఇస్తే, ఇప్పుడు ఈ సెక్షన్‌ చెల్లదని, ఒప్పుకునేది లేదని, తెలంగాణ భగ్గుమంటుందని, దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెరాసప్రభుత్వం ఎదురుదాడి మొదలుపెట్టింది. ఇది రాజ్యాంగవిరుద్ధమని ఒకాయన అంటే, సెక్షన్‌ 8ని చింపి పారేస్తామని మరొక నాయకుడంటాడు. రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికే ఈ సెక్షన్‌ విఘాతం కలిగిస్తుందని మరొక మేధావి ఉద్ఘాటిస్తాడు. రాష్ర్టాల హక్కులేం కావాలని వేరొ కాయన వాపోతాడు. అసలు సెక్షన్‌ 8 ని అమలుచేయాల్సిన అవసరం ఏముందని, హైదరాబాద్‌లో శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయని మరొకాయన సెలవిస్తాడు. ఆంధ్రావాళ్లు పెత్తనం చేస్తామంటే ఊరుకునేది లేదని మరొక ప్రొఫెసర్‌ హెచ్చరిస్తాడు.

ఈ మొత్తం వ్యవహారంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, తెలంగాణలో పలువురు రాజకీయ నాయకులు, కొంతమంది మేధావులు, మరికొన్ని సంఘాల వాదన పరస్పర విరుద్ధంగా, చట్టాన్ని అపహాస్యం చేసేవిధంగా, బెదిరింపు ధోరణిలో ఉంది. దీనికి సంబంధించి తెరాస నాయకులు, మద్దతుదారులు చేసే వాదనలు ఎంత పసలేనివో, ఎంత పక్కదారి పట్టించేవో, ఎందుకు చెల్లుబాటు కావో కొంచెం విశ్లేషిస్తే సామాన్యులకు కూడా తెలిసిపోతుంది. 
  • ఏ చట్టం ద్వారా అయితే విభజన జరిగిందో, ఏ చట్టం ద్వారా అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందో, ఆ చట్టం - ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం 2014 - లోని సెక్షన్‌ 8ని మాత్రం మేం ఒప్పుకోం. 

ఆంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజల అభీష్టానికి వ్యతిరే కంగా ఈ చట్టాన్ని రూపొందించిన విషయమూ, ఈ చట్టం ప్రకారమే అవశేష ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన అంశమూ అందరికీ తెలుసు. ఇప్పుడు రెండుప్రశ్నలు - ఒకటి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా, విభజన చట్టాన్ని రూపొం దించారు కాబట్టి, విభజన చెల్లుబాటు కాకుండా పోతుందా? రెండు, పార్లమెంటు ఆమోదించిన ఏదైనా చట్టంలో అను కూలంగా ఉండే అంశాలను అమలుచేసి, అననుకూలంగా ఉన్నవాటిని కాదనే వెసులుబాటు భారత రాజ్యాంగవ్యవస్థలో ఉందా? మాకు రాజ్యాంగమంతా ఓకే, కానీ ఆర్టికల్‌ మూడును మాత్రం మేం అంగీకరించం అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గానీ, ప్రజలు గానీ వాదులాడే అవకాశం ఏమైనా ఉందా?
  • సెక్షన్‌ 8 రాజ్యాంగం నిర్దేశించిన సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇది రాష్ర్టాల హక్కులను కాలరాయడమే.   

ఒక రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ద్వారా వ్యతిరేకించిన విభ జనను కేంద్రం ఏకపక్షంగా చేపట్టినప్పుడు సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలగలేదు! ఇరు ప్రాంతాల మధ్య సమస్యలను పరిష్కరించి, సామరస్యంగా విభజన వ్యవహారాన్ని నడప కుండా, కేకును కోసినట్టు రాష్ర్టాన్ని ఢిల్లీ పెద్దలు రెండు ముక్కలు చేసినప్పుడు సమాఖ్య సెంటి మెంటు గుర్తుకు రాలేదు! ఆయా ప్రాంత ప్రజల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా, ఏ రాష్ర్టాన్నయినా, ఎన్ని ముక్కలైనా చేయడానికి కేంద్ర ప్రభుత్వం అధికారాలు దఖలు పరుచుకుంటే, సమా ఖ్యకు ఇబ్బందేమీ లేదు! కానీ ఒక రాష్ట్ర రాజధానిలో, రెండు ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు, అక్కడి శాంతిభద్రతల వ్యవ హారం కేంద్రప్రభుత్వ ప్రతినిధి అయిన గవర్నర్‌ చేతిలో (ఒక తాత్కాలిక కాల పరిమితితో) ఉంటే మాత్రం సమాఖ్య స్ఫూర్తి కుప్పకూలిపోతుంది!! ఇది అవకాశవాదానికి పరాకాష్ట కాదా?
  • సెక్షన్‌ 8 అనేది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. హైదరాబాద్‌లో ఆంధ్రా పెత్తనాన్ని సహించేది లేదు. 

రాజ్యాంగ వ్యవస్థలకు, చట్టసభలకు ప్రాతిపదిక రాజ్యాంగమూ, చట్టమే గానీ, ఆత్మగౌరవం కాదు. రాష్ట్ర విభజనతో, అది జరిగిన తీరుతో మా ఆత్మగౌరవం దెబ్బ తిన్నది గాబట్టి, మేం ఇక కేంద్ర చట్టాలను పాటించం అని గానీ, కేజీ బేసిన్‌లో గ్యాస్‌ వంటి వనరుల మీద కేంద్ర ఆధిపత్యాన్ని ఒప్పుకోం అనిగానీ వాదించే హక్కు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఉంటుందా?

ఇక సెక్షన్‌ 8 కింద హైదరాబాద్‌లో శాంతి భద్రతల పర్య వేక్షణ అధికారాలు ఉండేది కేంద్ర ప్రతినిధీ, అలాగే తెరాస ఇటీవల ప్రత్యేక అభిమానం పెంచుకున్న గవర్నర్‌కే గానీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి గానీ, ఆ ముఖ్యమంత్రికి గానీ కాదు. గవర్నర్‌ సాధారణంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సలహా మేరకు, అవసరమైనప్పుడు మాత్రమే తన విచక్షణ ప్రకారం వ్యవహరించాలని సెక్షన్‌ 8 చెబుతోంది. దీనికి విపరీ తార్థాలు తీసి, ఆంధ్రప్రదేశ్‌ కేదో హైదరాబాద్‌ మీద అధికా రాలు ఇచ్చినట్టు వక్రభాష్యం చెప్పడం ఎందుకు? మధ్యలో ఓ పెద్ద మనిషి ఉంటాడన్నందుకే అంత ఉలుకుందెకు? 
  • ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ర్టాలవాళ్లు బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ర్టాల్లో మాకు అధికారాలు కావాలంటే ఎవరైనా ఒప్పుకుంటారా? అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు.

ఆ కొత్త రాష్ర్టాల ఏర్పాటుకు, ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగిన తీరుకు హస్తిమశకాంతం తేడా ఉందనే విషయం కేసీఆర్‌కి తెలియదని ఎవరూ అనుకోరు. మా ప్రాంతం మాకు రాష్ట్రంగా కావాలి అని డిమాండ్‌ చేసి, సాధించుకున్న ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ర్టాలు దేనికోసం లక్నో, పాట్నా గురించి మాట్లాడతాయి? బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ర్టాలకు రాయపూర్‌, రాంచీలతో పనేముంది? ఉమ్మడిరాష్ట్ర రాజధానిగా 60 ఏళ్లు ఉన్న ప్రాంతం విడిపోవాలని కోరుకున్నప్పుడు, ఆరు దశాబ్దాల పాటు అల్లుకున్న చిక్కుముడులని ఒక్కసారే విడదీయడం సాధ్యమయ్యేపనేనా? హైదరాబాద్‌లో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చినవారు ఎంతమంది? లక్నో, పాట్నాల్లో బతికే ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ వాసులు ఎంత మంది? ఈ లెక్కలు తెలియని అమాయకులేం కాదు తెరాస నాయకులు! ఇక ఫ్రాయిడియన్‌ స్లిప్‌ అంటారే, అది కేసీఆర్‌ మాటల్లో బయటపడింది. తెలంగాణ- బీహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ వంటి రాష్ట్రమైతే, తల్లి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ మాత్రం అక్కడ విడిపోయిన ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ వంటి రాష్ట్రమని కేసీఆరే అంటున్నారు. 
  • హైదరాబాద్‌లో శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. గవర్నర్‌ ఎందుకు జోక్యం చేసుకోవాలి?

ఇది ఎలా ఉందంటే, ప్రస్తుతం యుద్ధాలు లేవు కాబట్టి, సైన్యాన్ని రద్దు చేయండి అన్నట్టు. సెక్షన్‌ 8 అనేది ఒక ప్రత్యేక కాలపరిమితికి లోబడి అమలయ్యే చట్టం. పదేళ్ల తర్వాత నిజంగానే తెరాస వారు మళ్లీ అధికార పగ్గాలు చేపట్టి, ఆంధ్రావాళ్ల మీద అరాచకాలు చేసినా, ఈ చట్టంగానీ, గవర్నర్‌ గానీ ఏమీ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఎందు కంటే, అప్పటికి సెక్షన్‌ 8కి కాలం చెల్లుతుంది కాబట్టి. ఇదేదో సర్వకాల సర్వావస్థలందూ తెలంగాణ నెత్తిన పెట్టిన గుది బండ అన్నట్టు తెరాస చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు.

ఇక, విభజన తర్వాత హైదరాబాద్‌లో ఆంధ్రా ప్రజల మీద తెలంగాణ ప్రజలెవరూ దాడులు చేయలేదనేది వాస్తవం. వాళ్ల ఆస్తులు, ప్రాణాలకు ఎవరూ ముప్పుతేలేదు. తెలంగాణ ప్రజలకు అటువంటి చరిత్ర, సంస్కృతి లేదు. కానీ, తెరాస ప్రభుత్వం వేరు, తెలంగాణ ప్రజలు వేరు. విభేదాలు, వైషమ్యాలే రాజకీయ పెట్టుబడిగా ఎదిగి, అధికారాన్ని అందుకున్న తెరాస నాయకత్వం, ప్రభుత్వాన్ని ఏర్పరిచిన వెంటనే చేపట్టిన కార్యక్రమాలు అందరికీ తెలుసు. హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లను గుర్తించడానికి చేసిన యత్నాలు, ఆస్తుల పంపకాల వ్యవహారాల్లో గొడవలని ఆయా ప్రాం తాల, ప్రాంత ప్రజల వ్యవహారంగా చిత్రీకరించిన తీరు, ఆంధ్రా ఉద్యోగుల పట్ల ఇప్పటికీ అవలంబిస్తున్న వైఖరి ఇవేవీ ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం మీద హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రావారికి నమ్మకం, విశ్వాసం కలిగించేవిగా లేవు.

మొత్తంగా చూస్తే, హైదరాబాద్‌లో ఆంధ్రా ప్రాంత ప్రజల మీద నేరుగా చెప్పుకోదగ్గ వివక్ష ప్రదర్శించిన దాఖలాలు కనిపించవు. అయితే, తెరాస ప్రభుత్వం తన వ్యవహారశైలి ద్వారా హైదరాబాద్‌లో నివసించే కోస్తా, రాయలసీమ ప్రజల్లో ఒక రకమైన మానసిక భయాందోళ నలు కలిగించిన మాట మాత్రం వాస్తవం. భావోద్వేగాల మీద ఆధారపడి రాజకీయాలు చేసే పార్టీలున్నప్పుడు, మంట ఎప్పుడు అంటుకుంటుందో ఎవరూ చెప్పలేరు. ఇటు వంటి పరిణామాలని గుర్తించే, సెక్షన్‌ 8ని పొందుపరిచారు.
  •  ఏసీబీ కేసు కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సెక్షన్‌ 8 పాట అందుకొంది.

ఇది నిజం కావచ్చు. కానీ, పార్లమెంటులో ఆమోదం పొందిన ఒక చట్టం అమలుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్దేశాలతో నిమిత్తం లేదు. అసలు 2014 జూన్‌ నుంచే సెక్షన్‌8 అమలుకు ఆంధ్రప్రదేశ్‌ పట్టుపట్ట లేదని కొందరు విమర్శిస్తే, తొందరపడి ఈ చట్టం గురించి గొడవ చేస్తే, కొత్తగా ఏర్పడ్డ రాష్ర్టాల మధ్య విభేదాలు మరింత రాజు కుంటాయనే అభిప్రాయం కూడా వెల్లడయిన అంశాన్ని గుర్తుంచుకోవాలి.

  • రాజ్యాంగం ప్రకారం అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానివే. ఈ అధికారాలను లాగేసుకోవడం రాజ్యాంగ విరుద్ధం.

ఇదెలా ఉందంటే, రాజ్యాంగం ప్రకారం ప్రజలంతా చట్టం ముందు సమానులే, అందుకని, రిజర్వేషన్లు చెల్లవు అనడం లాంటిది! ఇంతకంటే అర్థరహిత వాదన మరొకటి ఉండదు. రాజ్యాంగం ప్రకారం, శాంతిభద్రతల పర్యవేక్షణ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే. కానీ, తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్‌లు పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉనికిలోకి వచ్చాయి. కొత్త రాష్ర్టాలు నిలదొక్కుకోవడానికి, ఇరు రాష్ర్టాలకు సంబంధించి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. వాటిలో సెక్షన్‌ 8 ఒకటి. విభజన చట్టం సమ్మతమైనప్పుడు, అందులోని అన్ని సెక్షన్లకి అంగీకారం ఉండాలి. లేదా, అటువంటి చట్టాన్నే నిరాకరించాలి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోకుండా, రాష్ట్ర అధికారాలను కేంద్రం లాక్కుంటోందని కాసేపూ, అంధ్రా వాళ్లు పెత్తనం చేస్తున్నారని కాసేపూ మాట్లాడటం మసిపూసి మారేడుకాయ చేయడమే. ఈ మాత్రం చట్టం, దాని నిర్వచనం సాక్షాత్తూ అటార్నీ జనరల్‌ అంతటి వాడికి కూడా తెలియదన్నట్టుగా తెరాస నాయకులు, మద్దతునిచ్చే మేధోవర్గం మాట్లాడటం విచిత్రం!

సెక్షన్‌ 8ని ఏ ప్రభుత్వమైనా రాజకీయ లబ్ధికోసం ఉపయోగించుకోవడం ఇరు రాష్ర్టాలకు శ్రేయస్కరం కాదు. కేంద్రం, గవర్నర్‌ తలుచుకుంటే ఈ సెక్షన్‌కి సంబంధించి రెండు ప్రభుత్వాలకు నచ్చజెప్పి, ఇరువురికీ ఆమోద యోగ్యంగా అమలుచేయడం కష్టం కాదు. తెలంగాణ ప్రభు త్వం తలుచుకోవాలే గానీ, సెక్షన్‌ 8 అధికారాలు ఇచ్చినా, గవర్నర్‌ శాంతి భద్రతల వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా, సామరస్యంగా వ్యవహారాన్ని నడిపే అవకాశం పూర్తిగా ఉంది. అయితే, రాజకీయంగా బోలెడంత ముడిసరుకు లభ్యంగా ఉన్నప్పుడు, రాజకీయ నాయకులు వదులుకుంటారా అనేదే ప్రశ్న.

(Published in Andhra Jyothy on 24-06-2015)